విజయవాడలో ఉగ్రలింకులు.. అదుపులో ముగ్గురు యువకులు

  • విజయవాడలో ఉగ్రవాద లింకులపై పోలీసుల ఆపరేషన్
  • ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్
  • సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టులు పెట్టినట్లు గుర్తింపు
  • యువకుల నుంచి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం
  • ఏ సంస్థతో సంబంధాలున్నాయనే దానిపై కొనసాగుతున్న విచారణ
విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే అనుమానంతో ముగ్గురు యువకులను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వించిపేటకు చెందిన ఇద్దరు 21 ఏళ్ల యువకులతో పాటు భవానీపురానికి చెందిన 20 ఏళ్ల యువకుడిని అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రమూలాలపై కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర సీఐ సెల్ అధికారులు నిరంతర నిఘా చేపట్టారు.

ఈ నిఘాలో భాగంగా సోషల్ మీడియా కార్యకలాపాలపై దృష్టి సారించిన అధికారులకు, ఈ ముగ్గురు యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, వారి నివాసాల్లో సోదాలు నిర్వహించి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ యువకులు విదేశాల్లోని ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి? వీరిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సోషల్ మీడియా ఖాతాల్లోని లింకులు ఎక్కడివి? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది.

AP Counter Intelligence
Vijayawada Terror Links
Vijayawada
Terrorism
ISIS
Social Media
Terror Suspects
AP Police
Counter Intelligence Cell

More Telugu News